Thursday 15 December 2016

ఒక్క వ్యాపారి.. 85 ఖాతాలు!

చండీగఢ్‌ :
పంజాబ్‌లోని ఒక వ్యాపారి తన దగ్గర ఉన్న నల్లధనాన్ని దాచుకోడానికి ఏకంగా 85 బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నాడు. ఈ విషయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీలలో తెలిసింది. పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా చేసిన తనిఖీలో ఈ ఖాతాలు బయటపడ్డాయి. అయితే ఈ ఖాతాల్లో ఎంత మొత్తం ఉంది, ఎన్నాళ్లుగా ఈ అకౌంట్లు ఉన్నాయన్న విషయాలు మాత్రం ఇంకా తెలియలేదు. పెద్దనోట్ల రద్దు, నల్లధనం కట్టడి అంశానికి ప్రజల మద్దతు కూడా క్రమంగా వస్తోందని, నల్లధనం కట్టలుకట్టలుగా దాచుకున్న వాళ్ల విషయాన్ని ప్రజలే బయటపెడుతున్నారని రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు, హోం మంత్రిత్వశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు బోగస్ బ్యాంకు ఖాతాల విషయాన్ని కూడా వాళ్లే చెప్పారంటున్నారు.

ఇప్పటివరకు పట్టుకున్న వాటిలో ఎక్కువగా బ్యాంకు మేనేజర్లు, ఎంట్రీ ఆపరేటర్ల పాత్రే కనిపిస్తోందని తెలుస్తోంది. వీళ్లు కలిసిపోవడంతో చాలావరకు కొత్తనోట్లు పక్కదారి పట్టాయని అంటున్నారు. పంజాబ్‌లోని జలంధర్, పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలలో ఈ వ్యవహారం ఎక్కువగా జరిగింది. బుధవారం రాత్రి ప్రజల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే ఈడీ వర్గాలు వ్యాపారవేత్త ఇంటిమీద దాడి చేయగా.. అతడి పేరు మీదే 85 బ్యాంకు ఖాతాలు ఉన్న విషయం తెలిసింది. ఈ విషయాన్ని తదుపరి దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించామని తన పేరు బయటపెట్టొద్దని కోరిన ఈడీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇక ఒక పేద మహిళకు చెందిన జన్‌ధన్ ఖాతానుంచి 58 లక్షల రూపాయలను కోల్‌కతాకు చెందిన ఒక వ్యాపారి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. ఈడీలోని ఆర్థికనిఘా వర్గాలు దీనిపై విచారించగా.. ఆ వ్యాపారి మొత్తం 7 కోట్ల రూపాయలను ఇలా ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు తేలింది.  దీన్ని కూడా సీబీఐకి అప్పగించారు.

No comments:

Post a Comment